జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కాటారం,జనవరి1,తెలంగాణజ్యోతి: జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవా లు –2026 సందర్భంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్-సీట్బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో, జిల్లా పోలీసు శాఖ–రవాణా శాఖ సమన్వయంతో నెల రోజుల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం, వాహనదారులకు సలహాలు, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, జిల్లా రవాణా అధికారి (డీటీఓ), ట్రాన్స్పోర్ట్ శాఖ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






