మేడారం జాతర విజయవంతానికి ఆదివాసీ సంఘాలతో ఐటీడీఏ ప్రత్యేక సమావేశం
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 29 (తెలంగాణ జ్యోతి): ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఐటీడీఏ అధికారులు ఆదివాసీ సంఘాలు, పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతర నిర్వహణ, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, వ్యాపార విధానాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. జాతర ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు పారిశుధ్యంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, జాతర పవిత్రతను కాపాడేలా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ అవసరమని, ఆదివాసీ సంఘాల వాలంటీర్లకు ప్రత్యేక డ్రెస్ ఇవ్వాలని కోరారు. జాతరలో షాపుల నిర్వహణలో ఆదివాసీ సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కోళ్ల, బెల్లం తదితర వస్తువుల ధరల విషయంలో ఒకే విధానం పాటిస్తే వ్యాపారం మెరుగ్గా సాగుతుందని మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ దొర పేర్కొన్నారు. ఆదివాసీ సంఘాలకు లిక్కర్, బెల్లం, కొబ్బరి వంటి వాటి కేటాయింపులు చేయాలని సూచించారు. సమావేశంలో వెలువడిన అన్ని సూచనలు, అభిప్రాయా లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లాకు మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహించడం, జాతరకు ప్రత్యేక నిధులు రావడం శుభపరిణామమని పేర్కొంటూ, జాతరను ఘనంగా నిర్వహించి ప్రభుత్వం, మంత్రి సీతక్కకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీడీ, ఎస్ఓ రాజ్కుమార్, పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసీ సంఘాల నాయకులు మడవి సాయి బాబా, గొప్ప వీరయ్య, కోర్స నరసింహమూర్తి, కొప్పుల రవి, ఉయిక శంకర్, పర్షిక సతీస్, ఈసం సుధాకర్, పూనేం సాయి, సుభద్ర, కొత్త సురేందర్, కబ్బాకుల శ్రావణ్, కాపులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.






