జేయూడీఏ పథకం కింద పశుసంపద మంజూరు చేయాలి
– ఐటీడీఏ పీఓకు గిరిజనుల వినతిపత్రం
వెంకటాపురం నూగూరు,డిసెంబర్29,తెలంగాణజ్యోతి: కేంద్ర ప్రభుత్వ జేయూడీఏ (JUDA) పథకం కింద గిరిజనులకు 90 శాతం సబ్సిడీతో మేకలు, గొర్రెలు, కోళ్లు మంజూరు చేయాలని కోరుతూ నూగూరు మండల పరిధిలోని గిరిజనులు సోమవారం ఎటూరునాగారం లోని ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జేయూడీఏ పథకాన్ని తమకు పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని కోరారు. పథకం కింద 90 శాతం సబ్సిడీతో పశుసంపదను మంజూరు చేస్తే ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, కోళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వినతిపత్రానికి జత చేసి సంబంధిత ఐటీడీఏ అధికారులకు అందజేశారు. గిరిజనుల అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించాలని వారు కోరారు.






