ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. మూడవ విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగిందన్నారు. వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిందన్నారు. వాజేడులో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. మూడవ విడతలో మొత్తం 46 సర్పంచ్ స్థానాలకు గాను ఒక స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 45 స్థానాలకు ఎన్నికలు జరిగాయని చెప్పారు. అలాగే 408 వార్డు స్థానాల్లో 79 స్థానాలు ఏకగ్రీవం కాగా, 329 స్థానాలకు పోలింగ్ నిర్వహిం చామని తెలిపారు. మూడు మండలాల్లో మొత్తం 53,918 ఓటర్లు ఉండగా, 45,228 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 83.88 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. మొదటి విడతలో గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూర్ నాగారం మండలాల్లో 78.65 శాతం, రెండవ విడతలో ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల్లో 82.93 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. విడతల వారీగా పోలింగ్ శాతం పెరుగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీసు బందోబస్తు, వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, పాత్రికేయులు మరియు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







