గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
వెంకటాపురం మండల ప్రత్యేక అధికారి డి. సంజీవరావు
వెంకటాపురం, డిసెంబర్ 16,తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశాల మేరకు వెంకటాపురం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జోనల్ ఆఫీసర్లు, పోలింగ్ అధికారులు, ఏపీవోలు, మండల ఎన్నికల నోడల్ ఆఫీసర్తో పాటు సహాయ జిల్లా ఎన్నికల అధికారులను నియమించినట్లు మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల నోడల్ అధికారి డి. సంజీవరావు తెలిపారు. వెంకటాపురం మండలంలో మొత్తం 25,336 మంది ఓటర్లు ఉండగా, అందులో 11,870 మంది పురుషులు, 13,465 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటరు ఉన్నారని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం 6 కౌంటర్లు, అదనంగా ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సిబ్బంది హాజరు నమోదు కోసం ప్రత్యేకంగా అటెండెన్స్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బంది మరియు ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాల వద్దకు చేర్చేందుకు 8 బస్సులను 8 రూట్లలో కేటాయించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించామని, రిటర్నింగ్ అధికారులకు బ్యాలెట్ పేపర్లు, ఇండెలిజిబుల్ ఇంకు, ముద్రలు అందజేశామని, ప్రిసైడింగ్ అధికారులకు స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ మెటీరియల్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు పోలీస్ బందోబస్తుతో పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చే ఏర్పాట్లు పూర్తిచేశామని, పోలింగ్ కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులను సిద్ధంగా ఉంచినట్లు డి. సంజీవరావు తెలిపారు.






