మేడారం జాతరకు ఆర్టీసీ–పోలీస్ సమన్వయ ఏర్పాట్లు
భక్తుల సౌకర్యాలపై ఆర్టీసీ డిపో పరిశీలించిన వైస్ చైర్మన్ నాగిరెడ్డి
ములుగు, డిసెంబర్ 16 (తెలంగాణ జ్యోతి): మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఏడీజీ నాగిరెడ్డి మేడారం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా బస్సుల నిర్వహణ, ప్రయాణికుల వేచిచూడే ప్రాంతాలు, శుభ్రత, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో గత జాతరతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంచడంతో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకాన్తో ఆయన చర్చించారు. అలాగే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని, డ్రైవర్లు–కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీ.ఎస్. దివాకర, జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకాన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డీ శివమ్ ఉపాధ్యాయ (ఐపీఎస్), ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీఈ వెంకన్న, ఈడీ సాల్మన్, ఆర్ఎం విజయభాను, ఆర్ఎం రవిచంద్ర, ములుగు డీఎస్పీ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్రా సీఐ దయాకర్, ఆర్ఐ అడ్మిన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.







