విశ్వజ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టాలి
ఎస్ఎఫ్ఐ ములుగు మండల కార్యదర్శి దీకొండ భరత్ డిమాండ్
వెంకటాపురం, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విశ్వ జ్యోతి ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ములుగు మండల కార్యదర్శి దీకొండ భరత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలకు అనుమతి ఒక ప్రాంతానికి తీసుకుని, మరో ప్రాంతంలో పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మండల కేంద్రానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే విద్యాశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ, ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, బాత్రూంలు లేక పోవడంతో పాటు మౌలిక సదుపాయాల లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బీఈడీ, టెట్ వంటి కనీస అర్హతలు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకుని ఉద్యమాలకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.






