ఖాసీందేవిపేటలో లెక్కింపుపై అనుమానాల మబ్బు
రెండు బ్యాలెట్ బాక్సులు లెక్కించకుండానే ఫలితం?
ములుగు ప్రతినిధి , డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఖాసీందేవిపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వివాదాస్పదంగా మారింది. లెక్కింపు సమయంలో రెండు వార్డులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను పక్కనపెట్టి, వాటి ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే అధికారులు తుది ఫలితాన్ని ప్రకటించారని ఓడిన సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 4వ, 8వ వార్డులు ఏకగ్రీవమైనప్ప టికీ సర్పంచ్ ఎన్నికలో ఈ రెండు వార్డులు కలిపి 397 ఓట్లు పోలైనట్లు తెలిపారు. చివర్లో లెక్కిస్తామని చెప్పిన అధికారులు ఆపై హడావుడిగా ఫలితాన్ని ప్రకటించడంతో అనుమానాలు పెరిగాయని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయం చేయాలని కోరుతూ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓను అభ్యర్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు.






