ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
– జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, డిసెంబర్ 10, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతం, పారదర్శకం, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మొత్తం 570 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావు లేకుండా అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, క్రమశిక్షణతో పనిచేయాలని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. రేగొండ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశం లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బందోబస్తు బాధ్యతలపై సూచనలు ఇచ్చారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని గణపురం, రేగొండ, గోరుకొత్తపల్లి, మొగుళ్ళపల్లి మండలాల్లో ఏకగ్రీవం అయిన ఐదు గ్రామపంచాయతీలను మినహాయించి మొత్తం 86 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తయ్యాయని, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో బందోబస్తు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. కొత్తపల్లి గోరి మండలంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ బందోబస్తు సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ స్టేషన్ భద్రత కోసం ఉదయం ప్రారంభం నుంచే విధి స్థానాలకు హాజరు కావాలి, ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు వేసేలా చూడాలి, కేంద్రాల చుట్టూ 100 మీటర్లలో గుమికూడడం నిషేధమని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. సున్నిత కేంద్రాల్లో అదనపు పికెట్టింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు, వీడియో రికార్డింగ్ టీంలు, క్విక్ రెస్పాన్స్ టీంలు (QRT) సిద్ధంగా ఉంటాయని చెప్పారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పార్టీ చిహ్నాలు, ప్రచార సామగ్రి నిషేధం, పోలింగ్ బూత్లో మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఓటర్లపై ఒత్తిడి, బెదిరింపులు, గుంపులు గుమికూడడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మద్యం పంపిణీ, డబ్బుల పంపిణీ, ఉద్రిక్తత సృష్టించడం వంటి చర్యలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వ్యక్తులను లేదా పార్టీలను కించపరచే పోస్టులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–219 ప్రకారం పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ప్రచారం నిషేధమని గుర్తుచేశారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, నైపుణ్యంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.






