మేజర్ పంచాయతీలో సర్పంచ్ బరిలో ఏడుగురు
– వెంకటాపురం మండలంలో చతుర్ముఖ, త్రిముఖ పోటీలు
– గెలుపోటములపై వాడీవేడీ చర్చ
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలలో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం పూర్తయ్యింది. ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు తుది పోటీదారుల జాబితాను నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద అధికారులు నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. పలు పంచాయతీలలో ఉపసంహరణలు తక్కువగా ఉండటంతో బహుముఖ, చతుర్ముఖ, త్రిముఖ పోటీలు అనివార్యమయ్యాయి. అభ్యర్థుల స్పష్టత రావడంతో గ్రామాలు ఎన్నికల రంగంలోకి దిగాయి. అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం మేజర్ పంచాయతీలో సర్పంచ్ పదవికి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవడం ఈసారి ఎన్నికలకు ప్రధాన ఆకర్షణగా మారింది. మేజర్ పంచాయతీలో నాలుగు వేలకు పైగా ఓటర్లు నమోదు కావడంతో పోటీ మరింత హోరాహోరీగా సాగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ ఇతర సంఘాలు, కూటములు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో రాజకీయ పరంగా ఈ పంచాయతీ హాట్స్పాట్గా మారింది. ఎన్నికల గుర్తులు కేటాయించడంతో అభ్యర్థుల మద్దతుదారులు ఫ్లెక్సీ దుకాణాలు, జిరాక్స్ కేంద్రాలు, ప్రింటింగ్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రచార సామగ్రి సిద్ధం చేసుకోవడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు.






