మందకోడిగా సాగుతున్న నామినేషన్ల పర్వం
బెస్టగూడెం సర్పంచ్ అభ్యర్థిగా భీమేశ్వరి నామినేషన్
వెంకటాపురం, డిసెంబర్ 4 (తెలంగాణ జ్యోతి): మండలంలో గ్రామ పంచాయతీ నామినేషన్ల పర్వం రెండో రోజూ మందకోడిగా కొనసాగింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పాటు మంచి ముహూర్తం ఉండటంతో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ల దాఖలు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మండలంలోని 18 పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు తదితర పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తల మునకలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మడే భీమేశ్వరి బెస్తగూడెం జి.పి. సర్పంచ్ అభ్యర్థిగా, వంకాయల సమ్మక్క మూడో వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు. నూగూరు జి.పి.లో ఇండ్ల శ్రీనివాసరావును, బీసీ మరిగూడెంలో సురిటి రాజేశ్వరిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా ఖరారు చేసింది. నామినేషన్ కార్యక్రమాల్లో బాలసాని వేణుగోపాల్, మన్యం సునీల్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 18 పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపికలో పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్రావు, మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ తదితరులు గ్రామాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తూ తుది జాబితా సిద్ధం చేసినట్లు, శుక్రవారం ఉదయమే నామినేషన్ల కేంద్రాలకు చేరుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.






