వెంకటాపురం మండలంలో 25,336 మంది ఓటర్లు
– పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ
– 3వ తేదీ నుండి నామినేషన్లు స్వీకరణ
వెంకటాపురం, డిసెంబర్2, తెలంగాణజ్యోతి : ములుగుజిల్లా నూగూరు –వెంకటాపురం మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో ఈసారి మొత్తం 25,336 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 11,870 మంది, మహిళలు 13,485 మందిగా నమోదు కావడం విశేషం. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో ఎన్నికల వేళ మహిళా ఓటు కీలకంగా మారనుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. మండలంలోని గ్రామ పంచాయతీలలో వెంకటాపురం మేజర్ పంచాయతి అత్యధికంగా 4,926 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. సూరవీడు పంచాయతి 2,068 మంది ఓటర్లతో రెండో స్థానంలో ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం మండలవ్యాప్తంగా 166 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లకు కావాల్సిన పోలింగ్ మెటీరియల్ అన్నీ సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడో తేదీ బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, అధికార పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు సహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు గెలుపు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్నారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన పార్టీలు, వ్యూహాత్మకంగా వాటిని రహస్యంగా ఉంచి సరైన సమయానికి ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.






