మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
— పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్రావు
వెంకటాపురం, నవంబర్23, తెలంగాణజ్యోతి : మారుమూల గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు, రైతులకు అవసరమైన రహదారులు, వంతెనలు, సేవలు అందించడం ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యమని ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చిడెం మోహన్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. పాత్రపురం పంచాయతీ పాలెం గ్రామం నుంచి గోదావరి పాయ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.90 లక్షల నిధులు విడుదల చేసింది. ఆదివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. దశాబ్దాలుగా ఆర్అండ్బీ రహదారి నుంచి గోదావరి పాయ వరకు రోడ్డు లేక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రోడ్డు పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. కార్యక్రమంలో దూడ సురేష్, కొప్పుల వెంకటేశ్వరరావు, చిరంజీవి, వెంకటేష్, పండా జయబాబు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






