ఇసుక లారీల రవాణా నిలుపుదలపై ఆలుబాక వద్ద రాస్తారోకో
- దుమ్ము–ధూళితో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు ఆవేదన
వెంకటాపురం, నవంబర్ 18 (తెలంగాణ జ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోదావరి ఇసుక ర్యాంపుల నుండి భారీ ఎత్తున ఇసుక లారీలు ములుగు జిల్లా వెంకటాపురం మండలం గుండా రాకపోకలు సాగించడం వల్ల ఎగిరే దుమ్ము–ధూళితో అనారోగ్యానికి గురవుతు న్నామని ఆరోపించిన స్థానికులు మంగళవారం ఆలుబాక సమీపంలో రాస్తారోకో చేపట్టి లారీలను నిలిపివేశారు. చర్ల–భద్రాచలం మార్గంలో గ్రామస్తుల నిరసనలతో ఇసుక లారీలను వెంకటాపురం, వాజేడు మీదుగా వరంగల్–హైదరాబాద్ వైపు మళ్లించడంతో విసుగు చెందిన ప్రజలు రహదారిపై నిలిచిన వందలాది లారీలను ఆపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాల సమస్యపై ఎమ్మెల్యే స్పందించకపోవడాన్ని విమర్శించిన ప్రజలు, ఇసుక లారీలు భద్రాచలం మీదుగానే తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు సిపిఎం మండల కార్యదర్శి జి. వాసు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు, బిజెపి నాయకులు సంఘీభావం తెలిపారు.






