వికలాంగులకు ట్రై సైకిళ్ల అందజేత
– మంత్రి సీతక్క చొరవతో సహాయం
వెంకటాపురం, నవంబర్16, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం ఏడ్చేర్లపల్లి, కొత్తూరు, ఎస్.సి కాలనీ గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులకు ఆదివారం వీల్చైర్లు, ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రోత్సాహంతో అలిమ్కో సంస్థ ఈ సహాయాన్ని అందించింది. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, ఏడ్చేర్లపల్లి మాజీ సర్పంచ్ వాసం మల్లీశ్వరి చేతుల మీదుగా లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. లబ్ధిదారులు కర్నె అఖిల్, మంచిర్ల రాకేష్, నక్క మేవాలాల్ తదితరులు మంత్రి సీతక్కకు, అలిమ్కో సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






