జవహర్నగర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ : డీఈవో సిద్ధార్థ రెడ్డి
– నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సస్పెన్షన్
వెంకటాపూర్,నవంబర్ 16, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్ హాస్టల్లో మౌలిక వసతుల కొరతపై విద్యార్థులు ధర్నా చేసిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత, శుభ్రత, తాగునీరు, బాత్రూంలు, టాయిలెట్లు, పరిశుభ్రతా పరికరాలు, లైటింగ్ వంటి వసతులన్నిటిని సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టమైనందున కేర్టేకర్ కవిత, ఆరోగ్య సహాయ కురాలు జ్యోతి, పహారా మహిళ అంజలిపై వెంటనే సస్పెన్షన్ విధించారు. విద్యార్థులు చేసిన శుభ్రత ఫిర్యాదుల నేపథ్యంలో తహసీల్దార్ గిరిబాబు పర్యవేక్షణలో శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. శీతాకాలం దృష్ట్యా హాస్టల్లో వేడి నీటి గీజర్లను ఏర్పాటు చేసి ప్లంబింగ్ పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని ప్రత్యేక అధికారికి ఆయన ఆదేశించారు. లైటింగ్ కొరతపై స్పందించిన విద్యాశాఖ అధికారి అవసరమైన విద్యుత్ మరమ్మత్తులు పూర్తి చేసి అదనపు వెలుగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, చదువు వాతావరణం ముఖ్యమని, హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అసలు ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ, మిగతా వసతులను వారం లోపున పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని సంబంధించిన అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ గిరిబాబు, బాలల అభివృద్ధి అధికారి రజిత, ప్రత్యేక అధికారి లక్ష్మీ పాల్గొన్నారు.






