ఘట్టమ్మ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
భక్తులకు మెరుగుపడనున్న సేదతీరే అవకాశాలు
ములుగు, నవంబర్ 16 (తెలంగాణ జ్యోతి): జిల్లా సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కారణంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా సేదతీరే అవకాశాలు మరింత మెరుగు కానున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం ఘట్టమ్మ తల్లి ఆలయం వద్ద రూ.45 లక్షల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రయాణం కొనసాగించడం సంప్రదాయమైందని, జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆలయం వద్ద భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీతక్క తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించిన నిధులు సరిపోని పక్షంలో ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని, గట్టమ్మ తల్లిని దర్శించిన అనంతరం భక్తులు సేదతీరేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






