హాస్టల్లో కనీస సౌకర్యాల లేమిపై విద్యార్థినుల ఆందోళన
– తక్షణమే సమస్యలను పరిష్కరించాలి
వెంకటాపురం, నవంబర్16, తెలంగాణజ్యోతి : వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్ హాస్టల్లో నెలకొన్న అనేక సమస్యలపై విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. మొత్తం 73 మంది విద్యార్థినులకు కేవలం మూడు బాత్రూంలు మాత్రమే అందుబాటులో ఉండడం, మిగతా బాత్రూంలు డోర్లు లేక రిపేరింగ్ పేరుతో నెలల తరబడి వాడుకలో లేకపోవడం తీవ్ర అసౌకర్యాలకు దారి తీస్తోందని వారు తెలిపారు. హాస్టల్కి సెక్యూరిటీ లేకపోవడం, గత నాలుగు నెలలుగా ఏఎన్ఎం అందుబాటులో లేకపోవడం తమ భద్రత, ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని విద్యార్థినులు వాపోయారు. హాస్టల్ పరిసరాల్లో లైట్లు లేక రాత్రివేళల్లో భయంతో గడపాల్సి వస్తోందని తెలిపారు. తాగునీటి సమస్య కూడా తీవ్రమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని, నాణ్యత తగ్గిపోయిందని విద్యార్థినులు ఆరోపించారు. ముఖ్యంగా నాన్ వెజ్ రోజున 73 మందికి రెండున్నర కిలోల మాంసం మాత్రమే తీసుకొచ్చిన సంఘటన తమకు తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. “ఈరోజు తెచ్చింది మీకే కనిపిస్తోందిని… రోజూ ఇదే పరిస్థితి ఉంటుంది” అంటూ అధికారులకు చూపించి వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే అన్ని సమస్యలను పరిష్కరించి హాస్టల్ను సక్రమంగా నిర్వహిం చాలని విద్యార్థినులు అధికారులను కోరుతున్నారు. విషయం తెలుసుకున్న డీఈవో సిద్ధార్థ రెడ్డి హాస్టల్ కు చేరుకొని విద్యార్థులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి వారం రోజుల్లో పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.






