ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం

ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం

– హైటెక్ తరహాలో బస్టాండ్ ఆధునీకరణ

 – రాష్ట్రంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం

 – 42శాతం రిజర్వేషన్ అమలు సాధ్యమే

 – రాష్ట్ర బీసీ, రోడ్డు రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్

– ములుగులో రూ.4.80కోట్లతో బస్టాండ్ అధినీకరణ పనులు

 – రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ప్రజల అభిప్రాయం మేరకే ప్రజా పాలన కొనసాగుతోందని, ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కళ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఆధునీకరణతో నెరవేర్చ బోతున్నామని, హైటెక్ తరహాలో నూతన బస్టాండ్ ను ఆరు నెలల లోపు పూర్తిచేసి ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ లతో కలిసి రూ.4. 80కోట్లతో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ములుగు సమీపంలోని గట్టమ్మ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కు మంత్ర సీతక్కతోపాటు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గట్టమ్మ తల్లికి పూజలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ములుగులో భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ తాము ఇచ్చిన హామీలనే కాకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ 1989లో నిర్మించగా ప్రస్తుతం బస్టాండ్ పరిస్థితి బాగాలేదని, మంత్రి సీతక్క తెలుపడంతో 32గుంటల స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి రూ.4.80కోట్ల నిధులు కేటాయించామని, అదేవిధంగా మంగపేట మండలంలో రూ.50లక్షలతో బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఏటూరునాగారంలో రూ.7 కోట్లతో బస్ డిపో నిర్మాణ పనులకు త్వరలోనే శంకు స్థాపన చేసయనున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి సమీపం లోని ప్రేమనగర్ వద్ద గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, వైద్య కళాశాల ఉన్న కారణంగా ఎకరం స్థలంలో రూ.45లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళా సంఘాలతో 600 బస్సులను కొనుగోలు చేసి బస్సు యజమానులుగా చేశామన్నారు.

ములుగులో చేపట్టనున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులు, ఆరు నెలల్లో పూర్తి చేయాలని, ప్రతీ నెలా ప్రగతి నివేదిక తెలపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాము కుల గణన చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి ముందుకు వచ్చిందని, దీనిపై కేంద్ర మంత్రులు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి సీతక్క చొరవ చూపడం హర్శించదగ్గ విషయమని కొనియాడారు.

ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం

బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం గొప్పవిషయం : మంత్రి సీతక్క

రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం గొప్ప విషయమని రాష్ట్ర మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ములుగు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా, మండలం, జిల్లాగా ఏర్పడిందని, ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసిందన్నారు. ములుగు జిల్లాలో పలు ప్రాంతాలలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులు చేయడానికి నిధులు కేటాయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్రంలో బీసీల కోసం 42శాతం రిజర్వేషన్ సాధించడం గొప్ప విషయమన్నారు. జిల్లా కేంద్రాన్ని రోల్ మాడల్ గా తీర్చిదిద్దడానికి రానున్న రోజులలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారడంతో ఎలాంటి పనులకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని, మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరిమణులు రామప్పను సందర్శించనున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నూతన బస్టాండు నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ రాజ్, డిప్యూటీ ఆర్ ఎం ఓ భాను కిరణ్, ఆర్డీవో వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్న, రవి చందర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment