వేదమంత్రోచ్చారణల నడుమ ప్రారంభమైన పుష్కరాలు
కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక వైభవం
జయశంకర్ భూపాలపల్లి, మే 21, తెలంగాణ జ్యోతి: కాళేశ్వరం త్రివేణి సంగమం గురువారం వేదమంత్రోచ్చారణలతో మారుమోగింది. దక్షిణ భారతదేశంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని విశ్వసించే అరుదైన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఉదయం 5:43 గంటలకు వైభవంగా ప్రారంభమయ్యాయి. “ప్రణీతా వరదా వైన్యా గౌతమీ చ సరస్వతీ.. సద్యః పంచ వహం త్యత్ర ప్రయాగాత్ కోటి శోధికమ్” అనే పౌరాణిక శ్లోకోచ్చారణల నడుమ త్రివేణి సంగమ తీరంలో పుష్కరుడిని సరస్వతి నదిలోకి ఆహ్వానిస్తూ ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో ఈ అరుదైన మహోత్సవాన్ని ఈసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుందని విశ్వసించే సరస్వతి ఘాట్ వద్ద పుష్కర మహోత్సవాలు ప్రారంభమయ్యా యి. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన సతీమణితో కలిసి పాల్గొనగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్ రెడ్డి రంగారెడ్డి, ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర మహోత్సవాలను ప్రారంభించగా, అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో పవిత్ర పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రముఖులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, శ్రీ శుభానంద దేవి, సరస్వతి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జ్ఞానప్రదాయిని సరస్వతి అమ్మవారి ఆశీస్సులుపొందాలని ఆకాంక్షించారు.








