అక్రమ ఎల్ఈడి లైట్లపై పోలీసుల కఠిన చర్యలు
వాహనదారులకు ఎస్సై తాజుద్దీన్ కౌన్సిలింగ్
గోవిందరావుపేట, మే5, తెలంగాణజ్యోతి:రాత్రిపూట రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న అక్రమ ఎల్ఈడి లైట్లపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మంగళవారం గోవిందరావుపేట మండలం పస్రా ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎల్ఈడి లైట్లు అమర్చుకున్న వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పస్రా ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ, అధిక కాంతి వెలువరించే ఈ లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లకు నేరుగా తాకి ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ రవీందర్ సూచనలతో, సీఐ దయాకర్ పర్యవేక్షణలో పస్రా ప్రధాన కూడలి వద్ద జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలకు ఇలాంటి ఎల్ఈడి లైట్లు అమర్చడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వాహనదారులు స్వచ్ఛందంగా అక్రమ లైట్లు తొలగించి, కంపెనీ ప్రమాణాలకు అనుగుణమైన సాధారణ లైట్లనే వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. ఈతనిఖీల్లో సివిల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









