చలి కాలంలో డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి
– జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పొగమంచు కారణంగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఒక ప్రకటనలో తెలిపారు.రోడ్లపై దృష్టి మందగించడం, వాహనాలు, పాదచారులు, సిగ్నల్స్ స్పష్టంగా కనిపించక పోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున డ్రైవర్లు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఎస్పీ సూచనలు : పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున కొంచెం ముందుగానే బయలుదేరాలి.
- అతివేగం, ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించాలి.
- హైబీమ్ వలన పొగమంచు కాంతిని చెదరగొట్టి దృష్టి తగ్గించే ప్రమాదం ఉన్నందున లోబీమ్ లైట్లు మరియు ఫాగ్ లైట్లు ఉపయోగించాలి.
- ముందు వెళ్తున్న వాహనం స్పష్టంగా కనిపించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షిత దూరం పాటించాలి.
- రోడ్డుపై స్పష్టత లేని పరిస్థితుల్లో లేన్ క్రమశిక్షణను తప్పకుండా పాటించాలి.
- అవసరమైతే కొద్దిగా కిటికీ అద్దాలు దించి దృష్టి మెరుగు పర్చుకోవాలి.
- పొగమంచు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొంతసేపు వాహనాన్ని ఆపి, పరిస్థితి సరిగా ఉన్న తర్వాత మాత్రమే ప్రయాణం కొనసాగించాలి.
- వాహనం ముందు–వెనుక అద్దాలు, వైపర్లు, డీ-ఫ్రాస్టర్లు శుభ్రంగా మరియు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి.
- మలుపులు, మారే దిశలలో ముందుగానే ఇండికేటర్లు ఇవ్వాలి.
- రోడ్లు తడిగా, స్లిప్పరీగా ఉండే అవకాశం ఉన్నందున సడన్ బ్రేకింగ్ను నివారించి, నెమ్మదిగా బ్రేక్ వేయాలి.
- చలికాలంలో రోడ్డు భద్రత ప్రతి డ్రైవర్ బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.






