వాజేడు మార్కెట్ నిల్వ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
వెంకటాపురం, మే 21, తెలంగాణ జ్యోతి: వాజేడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ధాన్యాగార నిల్వ కేంద్రాన్ని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గురువారం అధికారులతో కలిసి సందర్శించి మొక్కజొన్న కొనుగోళ్లు, రవాణా ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతుల వద్ద నుంచి కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మార్కెట్ గిడ్డంగులకు తరలించాలని మార్కెట్ కమిటీ అధికారులను ఆదేశించారు. ఆలస్యం వల్ల రైతులు, వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొక్కజొన్న రవాణాకు వాహనాల కొరత తలెత్తితే వెంటనే స్థానిక అధికారుల సహకారం తీసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








