పాఠశాలలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి
గిరివాణి, ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్,ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర
ఏటూరునాగారం, ఏప్రిల్ 20, తెలంగాణ జ్యోతి: పాఠశాలలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు గిరివాణి–ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి –గిరివాణి గిరిజన దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ నిర్లక్ష్యం లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గిరివాణి గిరిజన దర్బార్కు 96, ప్రజావాణికి 26గా మొత్తం 122 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారులు పాఠశాలలు, వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, వంటశాలలు, స్టోర్ రూములు, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, డీడీ జనార్దన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ, ఐటీడీఏ ఏఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









