గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు హెచ్పీవీ టీకాలు
వెంకటాపురం,ఏప్రిల్15,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సెక్టార్-1 రంగరాజపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించారు. సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శివాజీ పర్యవేక్షణలో అర్హులైన విద్యార్థినులకు టీకాలు అందజేశారు. చిరుతపల్లి-1లో 13 మంది, వెంకటాపురం ప్రాంతానికి చెందిన 5 మంది కలిసి మొత్తం 18 మంది బాలికలకు తల్లిదండ్రుల సమక్షంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్య బృందం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలను వివరించింది. ఈ టీకా ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు ఈ టీకా భవిష్యత్తుకు రక్షణ కవచంగా పనిచేస్తుందని డాక్టర్ శివాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్సి వైద్య సిబ్బంది, ఎంఎల్హెచ్పి జ్యోతి, నర్సింగ్ ఆఫీసర్ వరలక్ష్మి, ఫార్మా ఆఫీసర్ మీనా రాణి, ఆశ్రమ పాఠశాల వార్డెన్ విపివి రమణరావు, హెచ్ఈఓ కుప్పిలి కోటి రెడ్డి, సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు రోజారాణి, భారతమ్మ, సుశీల, వినోదతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.









