వాజేడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
వాజేడు, ఏప్రిల్ 14 తెలంగాణ జ్యోతి: బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ గణపురం (మొట్లగూడెం) గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జయంతి కమిటీ అధ్యక్షుడు కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ మడకం సుభద్ర, ఉపసర్పంచ్ కుంజ సుజాత ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ సుభద్ర జై భీమ్ జెండాను ఆవిష్కరించి “జై భీమ్” నినాదాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా కుమ్మరి రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని, మహిళలకు హక్కులు, కార్మికుల సంక్షేమానికి చట్టాలు వంటి ఎన్నో గొప్ప పనులు ఆయన వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









