హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీఐ రమేష్
వెంకటాపురం, ఏప్రిల్ 14, తెలంగాణ జ్యోతి: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని వెంకటాపురం సీఐ ముత్యం రమేష్ సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద గిరిజన సంత సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కే. తిరుపతిరావు, శిక్షణ ఎస్ఐలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.









