శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నాలుగో వార్షికోత్సవ పూజలు
వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన ఏకదంత వరసిద్ధి వినాయక స్వామి వారి నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఘనంగా పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం నుంచి 11:30 గంటల వరకు మండపారాధన, మహా కుంభాభిషేకం, శిఖర మహాకుంభాభిషేకం నిర్వహించనుండగా, సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం జరుగనుందని తెలిపారు. 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:34 నిమిషాలకు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రెండు వారాల ముందే సున్నాలు వేసి, విగ్రహాలకు రంగులు అద్దడంతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించగా, ఆలయం దివ్య కాంతులతో వెలిగిపోతోంది. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కే. శ్రీధరాచార్యులు, బ్రహ్మశ్రీ కే. శ్రీనివాసాచార్యులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని గ్రామ గ్రామాన ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తూ, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ కృపకు పాత్రులు కావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.






