మహాశివరాత్రి ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలి
ఆధ్యాత్మిక శోభతో నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
ములుగు, జనవరి 10 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లాలో ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించా లని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్ల నిర్వహణ, భక్తులకు వసతి సౌకర్యాలు, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంపుల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తమ ప్రణాళికలను వివరించారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రధాన రహదారుల ఇరు వైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చలివేంద్రాలు, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత లేకుండా పారిశుధ్య సిబ్బంది నిరంతరం విధులు నిర్వహించాలని, జాతర సందర్భంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలు మరియు పందిర్ల వద్ద అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







