సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు యువత నడుంబిగించాలి
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, జనవరి 08 (తెలంగాణ జ్యోతి): విద్యార్థులకు సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Fraud Ka Full Stop” నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలను ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. సైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. విద్యార్థులతో సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, బాధ్యతాయుత డిజిటల్ పౌరులుగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ఘటనలపై వీడియోల ద్వారా వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. విద్యార్థులు అవగాహనతో పాటు బాధ్యతా యుత పౌరులుగా వ్యవహరించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీవో సంధాన్, సీఐలు, ఎస్ఐలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





