అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తికై కృషి
– భక్తుల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు
– రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు, నవంబర్ 16, తెలంగాణ జ్యోతి : వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించనున్న సౌకర్యాల విషయంలో అనుకున్న సమయంలోనే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, భక్తుల మనోభావాలకు చెడులేకుండా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని పునరుద్ధ రిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి బంధువుగా, బాధ్యతగల నాయకుడిగా జాతర విజయవంతం కోసం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థికబలం పెంపు దిశగా ఈ జాతరలో హన్మకొండ నుంచి తాడ్వాయి వరకు వ్యాపారాలకు అవకాశాలు కల్పించి, వారికి ఆర్థిక సాయం అందించనున్నామని పేర్కొన్నారు. కోట్లాది భక్తులు విచ్చేసినా ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






