మేడారం జాతర విజయవంతం కోసం సమిష్టిగా కృషి చేయాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ట్రాఫిక్పై ప్రత్యేక శ్రద్ధ : మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
ములుగు ప్రతినిధి, జనవరి 2, (తెలంగాణ జ్యోతి): మేడారం జాతర 2026ను సమర్థవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు. మొదటగా ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఐజీ ఆరా తీసి, జాతరకు ముందే అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతరకు దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా పార్కింగ్ సదుపాయాలు, బందోబస్తు ఏర్పాట్లు, భక్తుల సాఫీ దర్శనం కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గత జాతరలో అనుభవం ఉన్న అధికారులు తమ తమ జోన్లు, సెక్టార్లలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసర మైనంత సిబ్బందిని నియమించడంలో వెనకాడవద్దని స్పష్టం చేశారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ముందస్తు దారి మళ్లింపు ప్రణాళికలు రూపొందించాలని ఐజీ ఆదేశించారు. భక్తులు వచ్చి వెళ్లే మార్గాల్లో స్పష్టమైన సూచికలు, క్రమబద్ధమైన వాహనాల ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రామగుండం సిపి అంబర్ కిషోర్జా ఐపిఎస్, వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఐపిఎస్, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరిష్ పి ఐపిఎస్, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ ఐపీఎస్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్ ఐపిఎస్, అడిషనల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.






