పుల్వామా అమరవీరులకు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో నివాళులు
ములుగు, తెలంగాణ జ్యోతి : 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో అమరులైన 40 మంది భారత సైనికులను స్మరించుకుంటూ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమక్షంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల డైరెక్టర్లు చిర్రా నరేష్, ముద్దం సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ పుల్వామా దాడి దేశాన్ని కలచివేసిన దుర్ఘటనగా నిలిచిందని, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల త్యాగం ఎప్పటికీ భారత ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని, దేశభక్తి భావనను విద్యార్థులు అలవరచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలు చేశారు. చివరగా అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రెండు నిమిషాల మౌనం పాటించి ఘనంగా సంతాపం తెలియజేశారు.







