జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : భారీ ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా చిన్న బోయినపల్లి నుండి ఏటూరు నాగారం జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి భారీ వృక్షాలు నేలకూలి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు, కార్లు తదితర వాహనాలతో ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంది. అయితే విషయం తెలుసు కున్న స్థానిక ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ చేరుకొని గంటకు పైగా శ్రమించి వాహనాలు ముందుకు కదిలేలా చేసారు. చెట్లు కూలిన ప్రాంతంలో జెసిబితో రహదారిపై అడ్డంగా పడి పోయిన భారీ వృక్షాలను తొలగించారు. ఇదే సమయంలో మహిళ పేషంట్ తో వస్తున్న అంబులెన్స్ ఆ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఇది గమనించిన ఎస్సై అంబులెన్స్ కు ముందు పరిగెడుతూ అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు పంపిస్తూ అంబులెన్స్ ను ముందుకు కదిలించారు. ఈ ఘటన చూసిన అక్కడి వాహనదారులు శభాష్ పోలీసు అని ఎస్సై తాజుద్దీన్ కు కితాబులు ఇచ్చారు.