షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 కి విరుద్ధంగా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలి
– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : షెడ్యూల్డ్ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, గిరిజన సంక్షేమ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఐదవ షెడ్యూల్డ్ భూభాగంలో 1/59, 1/70 చట్టానికి విరుద్ధంగా 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరులకు, ఇప్పగూడెం (జడ్) ప్రభుత్వ భూమిలో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల పరిధిలో వలస లంబాడీలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయాలని, చట్ట బద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించు కుంటున్నారని ఆయా భూములను, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు, కుమ్ము సురేష్, ఎట్టి కన్నయ్య, ఎట్టి సుగుణ, కుర్సం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.