ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
– నిర్మాణాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
తాడ్వాయి, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి: ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశించారు. మంగళవారం ఆలయంలో కొనసాగుతున్న ఫ్లోరింగ్, గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడిన ఎస్పీ, పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా పగలు–రాత్రి విరామం లేకుండా పనులు కొనసాగించాలని సూచించారు. భక్తుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే భక్తుల రాక ప్రారంభమైన నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పనులపై పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అలాగే కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలు, విద్యుత్ సరఫరా కల్పించి రాత్రి వేళల్లోనూ పనులు సాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పస్ర సీఐ దయాకర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, మధుకర్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






