ములుగు బస్టాండ్ పరిశీలించిన ఆర్టీసీ ఎండి
జాతరకు 3,500 ప్రత్యేక బస్సులు, 10 వేల మంది సిబ్బంది
20 లక్షల మంది భక్తుల రవాణా లక్ష్యం
– బస్టాండ్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
ములుగు, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నాటికి బస్టాండ్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన రవాణా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జాతర కోసం ప్రత్యేకంగా 3,500 బస్సులను నడపనున్నట్లు, వీటిలో 10 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మొత్తం మీద సుమారు 20 లక్షల మంది భక్తులను రవాణా చేసేలా ప్రణాళిక రూపొందించామని, గత జాతరతో పోలిస్తే ఈసారి 4–5 లక్షల మంది అదనపు ప్రయాణికులను రవాణా చేసేలా ఏర్పాట్లు పెంచామని చెప్పారు. అన్ని రూట్లను ఖరారు చేసి సమగ్ర ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలో 7 ప్లాట్ఫారమ్లతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కొత్త బస్టేషన్ నిర్మాణం చేపట్టామని, జాతర అవసరాలకు అనుగుణంగా ఇది ఉపయోగపడేలా అన్ని చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి స్పష్టం చేశారు.







