రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి
- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం అందజేత
– తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు
హైదరాబాద్, నవంబర్18,తెలంగాణ జ్యోతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి ఎరుకలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ను తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు వినతిపత్రం ద్వారా కోరారు. మంగళవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా లోకిని రాజు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుకు 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 కోట్లతో “ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్”ను యథావిధిగా కొనసాగించాలని, ఇది వేలాది ఎరుకల కుటుంబాలకు ఉపయోగకరమైన పథకమని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నిజాంపేట్లో గత ప్రభుత్వం మూడున్నర కోట్లతో నిర్మాణం ప్రారంభించిన ఏకలవ్య భవనం నిధుల్లేక పూర్తి కాకపోవడంతో, భవనం పూర్తి స్థాయికి రావడానికి అదనంగా 5 కోట్లు విడుదల చేయాలని లోకిని రాజు కోరారు. ఎరుకల జాతిని అధికారికంగా గుర్తించి అభివృద్ధికి కావాల్సిన పథకాలు, కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.






