పిఆర్సీ వెంటనే అమలు చేయాలి
ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
వీసం బుచ్చయ్య పదవీ విరమణ సన్మానంలో డిమాండ్లు
సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోరింపు
టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి
వెంకటాపురం నూగూరు, జనవరి23 (తెలంగాణ జ్యోతి): పిఆర్సీ వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీనగరం ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పాఠశాలలో శుక్రవారం వీసం బుచ్చయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన చావా రవి మాట్లాడుతూ 39 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా నిబద్ధతతో సేవలందించి గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన వీసం బుచ్చయ్య సేవలను కొనియాడారు. పేద విద్యార్థుల అవసరాల కోసం తన స్వంత డబ్బులు ఖర్చుచేసి వారి చదువు కొనసాగేటట్లు చూసిన మానవతావాది అని ప్రశంసించారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా కొత్త పిఆర్సీ అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శిస్తూ, ఉద్యోగులకు వెంటనే పిఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ కార్యదర్శులు సమ్మారావు, రంజిత్ కుమార్, వెంకటేష్, వెంకటాపురం ఎంఈఓ సత్యనారాయణ, ములుగు జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సృజన్ ప్రసాద్, జనగామ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ములుగు జిల్లా కోశాధికారి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి చెంచయ్యతో పాటు వివిధ సంఘాల జిల్లా బాధ్యులు, టీఎస్ యూటీఎఫ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






