మేడారంలో అభివృద్ధి పనులకు వేగం పెంచాలి
జాతర ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
ములుగు, జనవరి 07, తెలంగాణ జ్యోతి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి, సౌకర్యాల పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారు లను ఆదేశించారు.
బుధవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్, ఐటిడిఎ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి మేడారం మ్యూజియం, చిలకలగుట్ట, ఊరట్టం కాజ్వే, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
శుక్రవారం లోపు ఆర్చ్ పిల్లర్లు, అనుబంధ నిర్మాణాలు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సభా స్థలం సిద్ధం చేయాలని, ముందస్తు మొక్కులు చెల్లిం చుకునే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనాలు కల్పించాలని, భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రథమ లక్ష్యంగా ప్రతి శాఖ బాధ్యతగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
మేడారం జాతరను విజయ వంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తికావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.







