మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి – ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు
వెంకటాపురం, నవంబర్ 24, తెలంగాణజ్యోతి : మహిళా ఉన్నతి, సాధికారతే తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పథకాలను అమలు చేస్తోందని, ప్రతి మహిళ ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం ఆయన ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో వరుసగా పర్యటించి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా భారీ రుణాలు మంజూరు అవుతున్నాయని తెలిపారు. ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించినప్పుడు సభ్యురాలు తీసుకున్న రుణానికి అనుగుణంగా న్యాయం చేసి, ఇన్సూరెన్స్ ద్వారా భీమా సొమ్ము చెల్లించే విధానం అమల్లో ఉందని వివరించారు. తొలివిడతగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ జరుగుతుందని, రెండో విడతలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయబడతాయని తెలిపారు. ఏ మహిళా కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి అర్హురాలికి చీరలు చేరడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అనంతరం మరికాల పంచాయతీ సుడిబాక గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, గిరిజన ప్రాంతాల్లో అర్హుల సంఖ్య అధికంగా ఉండటంతో ఐటీడీఏ ద్వారా మరో 1,000 ఇళ్లు మంజూరు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్కకు సభముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనలో ములుగు అదనపు కలెక్టర్ సంపత్ కుమార్, ఐసిడిఎస్ అధికారులు, వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్, చిడెం సాంబశివరావు, చిట్టేం సాయి తదితరులు, వాజేడు మండల అధికారులు, అలాగే వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, ఎస్సై తిరుపతిరావు, శిక్షణ ఎస్సైలు పాల్గొన్నారు.






