ములుగులో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ వేడుకలు
పార్టీ చరిత్రను గుర్తుచేసుకున్న నేతలు : కార్యకర్తల ఉత్సాహం
ములుగు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: జిల్లా కేంద్రంలోని అంగడి చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్, టిడిపి ములుగు మండల అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సలీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి, తక్కువ కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత టిడిపిదేనని తెలిపారు. నేటి రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను తయారుచేసిన పాఠశాలగా టిడిపి నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు యాసం ఐలయ్య, నాయకులు రహీం, ఫరూక్ అబ్దుల్, నిర్మల, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.









