బాల కార్మిక నిర్మూలనకు ములుగు జిల్లాలో కఠిన చర్యలు
రైతులకు ముందస్తు హెచ్చరికలు
నిబంధనలు అతిక్రమిస్తే జైలు, జరిమానా
ములుగు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్లైన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, పోలీస్ శాఖ సంయుక్తంగా ఏటూరునగరం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మిరప తోటలు సహా వ్యవసాయ క్షేత్రాల్లో చిన్నపిల్లలను కూలీలుగా వినియోగిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో బృందాలు నేరుగా పొలాల్లోకి వెళ్లి పరిశీలించాయి. ఈ సందర్భంగా సుమారు 100 మంది రైతులకు ముందస్తు అవగాహన నోటీసులు జారీ చేసి చట్టపరమైన నిబంధనలను వివరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో పెట్టకూడదని, 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల బాలలను ప్రమాదకర పనుల్లో నియమించడం నేరమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చైల్డ్ లేబర్ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే బడికి వెళ్లే పిల్లలను పనులకు వినియోగించవద్దని, వలస కూలీల నియామకంలో జాతీయ నిబంధనలు పాటించాలని రైతులకు సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 లేదా 112కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు నిరంతరం చర్యలు కొనసాగుతాయని జిల్లా సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.









