ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు
ఏటూరునాగారం, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రం లోని రామాలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అర్చకులు ఏళ్ల ప్రగడ నాగేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో, ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యుల సహకారంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ పర్వదినాన్ని పురస్కరించు కుని ఆలయ ప్రాంగణంలో మహిళలచే సామూహిక కుంకుమ అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి తరలివచ్చి దేవాదిదేవతల దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అలువాల శ్రీనివాస్తో పాటు గుంత రమేష్, తాడూరి దీనబంధవ స్వామి, కత్తెర శ్రీనివాస్, గంపల శివ, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






