గాయపడిన దుప్పిని కాపాడిన ఎంఈఓ శ్రీనివాస్
ములుగు, ఫిబ్రవరి 05, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం నుంచి కమలాపురం వెళ్లే మార్గంలో దుప్పుల గుంపు రోడ్డును దాటుతున్న సమయంలో ఇసుక లారీ ఢీకొనడంతో ఒక దుప్పి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారి గడ్డి శ్రీనివాస్ ఈ ఘటనను గమనించి స్పందించారు. సృజన్, రాంబాబు సహా మరికొందరి సహకారం తో దుప్పికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం బైక్పై ఏటూరునాగారం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి పశు వైద్యాధికారి ద్వారా చికిత్స చేయించారు. అనంతరం దుప్పిని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వన్యప్రాణులు అడవికి ఆభరణాల వంటివని, వాటిని కాపాడుకున్నప్పుడే జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉండి మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సృజన్, రామన్నగూడెం రాంబాబు, దయానంద్ బీట్ ఆఫీసర్, అబ్దుల్ రెహ్మాన్ (ఎఫ్ఆర్ఓ), డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నారాయణతో పాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.






