5వ బెటాలియన్ టీజీఎస్పి నూతన నిర్మాణాలకు శంకుస్థాపన
డీజీపీ బి.శివధర్ రెడ్డి చేతుల మీదుగా బెల్ ఆఫ్ ఆర్మ్స్, కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం
ములుగు, జనవరి 18, తెలంగాణ జ్యోతి: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఉన్న 5వ బెటాలియన్ టీజీఎస్పి ప్రాంగణంలో నూతనంగా చేపట్టనున్న భవనాలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (టీజీఎస్పి బెటాలియన్లు) సంజయ్ కుమార్ జైన్, అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, ఐజీపీ చంద్రశేఖర్ తదితర ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ ప్రాంగణంలో బెల్ ఆఫ్ ఆర్మ్స్ భవనానికి శంకుస్థాపన చేయగా, నూతన కాన్ఫరెన్స్ హాల్ను డీజీపీ ప్రారంభించారు. నిర్మాణాల నాణ్యత, వినియోగ సౌలభ్యం, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా ఏర్పాటుచేస్తున్న వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు మెరుగైన మౌలిక వసతులు, నివాస మరియు శిక్షణ సదుపాయాలు అత్యంత అవసరమని పేర్కొంటూ, పోలీస్ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శిక్షణలో క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాలు, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం కీలకమని సూచిస్తూ, బెటాలియన్ అభివృద్ధికి అవసరమైన పనులను వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం, అదనపు కమాండెంట్ బి. సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్ కుమార్, శ్రీనివాస్ రావు, ఆర్ఐలు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







