భూ భారతి చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం
– అధికారులు తప్పు చేస్తే చర్యలు తప్పవు.
– రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ములుగుప్రతినిధి, జూన్ 11, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోని నిరుపేద రైతుల భూ సమస్యలను పరిష్కరించడానికే రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండల కేంద్రం లోని రైతు వైదిక లో మంత్రి సీతక్కతో పాటు ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని భూభారతి చట్టం రెవిన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యల గురించి రైతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, పేద రైతులకు న్యాయం జరగకుండా పెద్ద రైతులకు న్యాయం జరిగిందని అన్నారు. నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ చట్టంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి వీలు కల్పించడం జరిగిందని, అర్హులైన వారందరికీ అండగా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రతి రైతుకు న్యాయం చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అధికారులు తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ వ్యవసాయం సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు పట్టాలు అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అనేక అంశాలతో భూ భారతి చట్టాన్ని పొందుపరిచారని, చట్టం అమలుపై రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకొని విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ భూములపై హక్కులు పొందడానికి చట్టం ఎంతగానో దోదపడుతుందని అభిప్రాయపడ్డారు.ఈకార్యక్రమంలోఅదనపుకలెక్టర్లు మహేందర్ జి.సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, రైతులు సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.