విచ్చలవిడి ఇసుక రవాణాను నియంత్రించాలి
– ఇసుక క్వారీల లైసెన్స్ రద్దు చేయాలి
– అధిక లోడుతో ఇసుక లారీలు పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు..
– సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్…
– యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వందలాది ఇసుక లారీలు అధిక లోడుతో వెళ్తుండడంతో ఆర్ఎంపీ రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని ఇతర వాహనాలు ద్విచక్ర వాహనాల ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్, యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మహాదేవపూర్ మండలం లోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలు ఇసుకను తరలిస్తున్నారని, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీల లో విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ అధిక లోడుతో లారీల్లో తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని, తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక లోడుతో తరలిస్తున్న లారీలను బందు చేయాలని విచ్చలవిడిగా ఇసుక దందా చేస్తున్న ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొనసాగింది, ఈ ప్రభుత్వంలోనైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు. ఇసుక లారీల రవాణాతో అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో మరణిస్తున్నారని కాలేశ్వరం నుంచి భూపాల పల్లికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని రోడ్లు చూస్తే అధిక లోడ్ ఇసుక లారీలతో రోడ్లు మొత్తం కృంగిపోయి నష్టం జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు.