మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు పక్కాగా చూపించాలి : కమిషనర్ రమేష్
ములుగు, ఫిబ్రవరి 05 (తెలంగాణ జ్యోతి) : ములుగు మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ స్పష్టం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఖర్చు పరిమితి రూ.1లక్షగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పరిమితిని మించినట్లయితే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల లావాదేవీల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అన్ని ఖర్చులను అదే ఖాతా ద్వారా నిర్వహించాలని, నగదు చెల్లింపులు ఒక్కొక్కరికి రూ.5వేలు మించరాదని తెలిపారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు రూ.10వేలకు మించి నగదు కలిగి ఉండరాదని ఆదేశించారు. ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, వాహన అద్దె, సభల ఏర్పాట్లు, భోజనం, వలంటీర్ల ఖర్చులు సహా అన్ని వ్యయాలను రోజువారీగా ఖర్చు పుస్తకంలో నమోదు చేసి రసీదులు జత చేయాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుల లెక్కలను ఫిబ్రవరి 5, 7, 9 తేదీల్లో ఎన్నికల అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం 45రోజుల్లోపు తుది ఖర్చు లెక్కలను మున్సిపల్ కమిషనర్కు సమర్పించకపోతే అనర్హత వేటు, పదవి రద్దు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలు ములుగు మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలకు వర్తిస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు.






