బాల్య వివాహ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
వెంకటాపూర్, డిసెంబర్ 23 (తెలంగాణ జ్యోతి): ప్రతి ఒక్కరూ బాల్య వివాహ నిషేధిత చట్టాలతో పాటు ఇతర ముఖ్య చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో “బాల్ వివాహ్ ముక్త్ భారత్” ప్రచారంలో భాగంగా వెంకటాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహ నిషేధిత చట్టం, పోక్సో చట్టం, విద్య హక్కు చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, మోటార్ వాహనాల చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలని, అలాగే ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధికతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





